Donald Trump: వరుసగా ఏడో రోజు లాభాలు.. 80 వేలు దాటిన సెన్సెక్స్

- చైనా దిగుమతులపై భవిష్యత్ చర్చల్లో సుంకాలు తగ్గిస్తామన్న ట్రంప్
- ఈరోజు లాభాల్లో కొనసాగిన ఐటీ సూచీ
- 80,116కి పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ... మన మార్కెట్లు ఈరోజు రాణించడం విశేషం. భవిష్యత్తులో జరిగే చర్చల్లో చైనా దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి.
ముఖ్యంగా ఐటీ సూచీ ఈరోజు బాగా లాభపడింది. బ్యాంకెక్స్ స్టాకులు పతనమయ్యాయి. సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్క్ ను దాటింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు లాభపడి 80,116కి ఎగబాకింది. నిఫ్టీ 161 పాయింట్లు పుంజుకుని 24,328 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో మన రూపాయి మారకం విలువ 24 పైసలు బలహీన పడి ప్రస్తుతం రూ. 85.43గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (7.72), టెక్ మహీంద్రా (4.63), టాటా మోటార్స్ (4.59), ఇన్ఫోసిస్ (3.69), మహీంద్రా అండ్ మహీంద్రా (3.56).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.98), కోటక్ బ్యాంక్ (1.80), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.11), యాక్సిస్ బ్యాంక్ (0.87), ఐటీసీ (0.68).