KTR: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించింది: కేటీఆర్

BRS Silver Jubilee Public Meeting KTRs Announcements

  • ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
  • సభా స్థలిని పరిశీలించిన కేటీఆర్, భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి
  • ప్రభుత్వ విద్యుత్‌పై నమ్మకం లేదని, 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న కేటీఆర్
  • సభలో కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడి
  • పహెల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ నేతల నివాళి

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ హిమాలయాల స్థాయికి తీసుకెళ్లారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు గులాబీ జెండా వైపే చూస్తున్నారని, బీఆర్ఎస్ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని కేటీఆర్ అన్నారు.

వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ గతంలో అనేక విజయవంతమైన సభలు నిర్వహించిందని, ఇప్పుడు పార్టీ వార్షికోత్సవ సభకు కూడా ఇదే వేదిక కావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, సుమారు 40 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా 10 లక్షల మంచి నీటి బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని, వైద్య సేవలకు గాను 100 వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సరఫరాపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వ విద్యుత్‌పై నమ్మకం లేనందున, సభా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తగా 200 జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఎల్కతుర్తి సభ అతిపెద్ద బహిరంగ సభగా నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎడ్లబండ్లపై కూడా సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఈ సభ వేదికగా కేసీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరును, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తారని చెప్పారు. ఏప్రిల్ 27న రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీలలో పార్టీ జెండా ఆవిష్కరించి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

పహల్గాం మృతులకు నివాళి

అంతకుముందు, జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

KTR
BRS
Telangana
KCR
ElkaTurthi
Party Anniversary
Public Meeting
Warangal
Political Rally
Telangana Politics
  • Loading...

More Telugu News