T Raja Singh: పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్

- ఉగ్ర చర్యను తీవ్రంగా ఖండించిన రాజాసింగ్
- మృతులకు నివాళి, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్ష
- ఉగ్రవాదులను మోదీ, అమిత్ షా వదలరని వ్యాఖ్య
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో శాంతి నెలకొందని వెల్లడి
జమ్ముకాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడిపై హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమాయకులపై జరిగిన ఈ దాడి హేయమైన చర్య అని రాజాసింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోరని ఆయన అన్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పరిస్థితులు ప్రశాంతంగా మారాయని రాజాసింగ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని పట్టుకునే వరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విశ్రమించరని రాజాసింగ్ పునరుద్ఘాటించారు.