Pawan Kalyan: పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోంది: డిప్యూటీ సీఎం పవన్

- ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతి
- వారి గౌరవార్థం జనసేన పార్టీ ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు సంతాప దినాలు
- మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ జెండా అవనతం
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ జనసేన పార్టీ ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుందని తెలిపారు.
"పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వారి గౌరవార్థం జనసేన పార్టీ ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంది. మా పార్టీ జెండాను అవనతం చేస్తున్నాం.
ఈ క్లిష్ట సమయంలో ఐక్యంగా ఉందాం. మన భారత ఐక్యతను ఏ ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలి. సమష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం... కలిసికట్టుగా ఉందాం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది" అని పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు.