Pahalgham Terrorist Attack: పహల్గామ్ ఉగ్రదాడి... ఇప్పుడు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న ఫొటో ఇదే!

- మరోసారి నెత్తురోడిన కశ్మీర్ లోయ
- ప్రఖ్యాత పర్యాటక కేంద్రంపై ఉగ్ర పంజా
- 26 మంది వరకు మృతి!
- ఘటన స్థలంలో హృదయ విదారక దృశ్యాలు
జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో దారుణం చోటుచేసుకుంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారింది. ఈ ఘటనలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అనధికారిక వర్గాల సమాచారం. అయితే, మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాడి జరిగిన ప్రదేశంలో హృదయ విదారక దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రాణభయంతో పర్యాటకులు పరుగులు తీశారు. "దయచేసి నా భర్తను కాపాడండి... ఆయనను బతికించండి" అంటూ ఓ మహిళ చేసిన ఆర్తనాదాలు అక్కడ నెలకొన్న భీతావహ పరిస్థితికి అద్దం పట్టాయి. కాసేపటి తర్వాత విగతజీవుడిగా ఉన్న భర్త పక్కనే దీనంగా కూర్చున్న ఆమె ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ ఆమె పరిస్థితి పాట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
రక్తం మరకలతో ఉన్న ముఖంతో మరో మహిళ నిస్సహాయంగా చూస్తూ కనిపించింది. "మేము టిఫిన్ తింటుండగా ఓ వ్యక్తి వచ్చి నా భర్తపై కాల్పులు జరిపాడు" అని ఓ బాధితురాలు కన్నీటి పర్యంతమైనట్టు సామాజిక మాధ్యమాల్లోని వీడియోల ద్వారా తెలుస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న తమ వారిని ఆసుపత్రికి తరలించాలంటూ పలువురు చేసిన విజ్ఞప్తులు కంటతడి పెట్టించాయి. ఈ దాడిలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా మరణించినట్లు సమాచారం. ఆయన భార్య, కుమారుడి కళ్లెదుటే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.
