Owaisi: యా హబీబీ, యా హబీబీ.... ప్రధాని మోదీ సౌదీ పర్యటనపై ఒవైసీ వ్యంగ్యం

- సౌదీ పర్యటనకు వెళ్లిన మోదీ
- వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుతూ మోదీ పర్యటన గురించి ప్రస్తావించిన ఒవైసీ
- ముస్లిం దేశాల్లో వక్ఫ్ లేదంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమంటూ వెల్లడి
కొత్త వక్ఫ్ చట్టంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన వక్ఫ్ వ్యతిరేక సభలో పాల్గొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఓవైసీ మాట్లాడుతూ, "ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళుతున్నారు. అక్కడ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ను కలిసి 'యా హబీబీ, యా హబీబీ' (నా ప్రియ మిత్రమా) అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. కానీ ఇక్కడికి తిరిగి రాగానే, దుస్తులను బట్టి ముస్లింలను గుర్తించాలని ప్రజలకు పిలుపునిస్తారు" అంటూ విమర్శించారు. ముస్లిం దేశాలలో వక్ఫ్ అనేది లేదంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఒవైసీ కొట్టిపారేశారు.
"ఫలానా ముస్లిం దేశంలో వక్ఫ్ లేదని పార్లమెంటులో బీజేపీ నేత ఒకరు అన్నారు. నేను ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలనుకుంటున్నాను. మీ సౌదీ అరేబియా పర్యటనలో, మదీనా నగరం వక్ఫ్ భూమిపైనే నిర్మితమైందా అని అక్కడి యువరాజును అడగండి. అది రాచరికమైనా, ప్రజాస్వామ్య దేశమైనా.. ప్రతీ ముస్లిం దేశంలోనూ వక్ఫ్ వ్యవస్థ ఉంది" అని ఓవైసీ స్పష్టం చేశారు.
"2013 వక్ఫ్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అధికారాల విభజన సిద్ధాంతం ప్రకారం న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు అన్నీ స్వతంత్రమైనవే. ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేసినా లేదా రాజ్యాంగంలోని ఏదైనా అధికరణాన్ని దుర్వినియోగం చేసినా, న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. న్యాయ వ్యవస్థే లేకపోతే మరి మేం ఎక్కడికి వెళ్లాలి?" అని ప్రశ్నించారు.
'పార్లమెంటే సర్వోన్నతమైనది' అంటూ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ మీడియా ఎదుట ప్రస్తావించారు. ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ "అది ఆయన (ధన్ఖర్) పరిమిత అవగాహన. పార్లమెంట్ కచ్చితంగా సర్వోన్నతమైనది, స్వతంత్రమైనది. అదే సమయంలో న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు కూడా స్వతంత్రమైనవే. అందుకే అధికారాల విభజన అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. మీరు తప్పుడు చట్టాలు చేస్తే, రాజ్యాంగ అధికరణాలను దుర్వినియోగం చేస్తే, అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది" అని ఓవైసీ వివరించారు.