Palla Srinivasa Rao: ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు గ్రీవెన్స్ శుక్రవారానికి మార్పు: పల్లా శ్రీనివాసరావు

- ప్రతి బుధవారం టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమం
- ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు అందాయన్న పల్లా
- చంద్రబాబు ఆదేశాలతో మార్పు చేశామని వెల్లడి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పు చేసినట్టు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు ప్రతి బుధవారం నిర్వహించే గ్రీవెన్స్ ను ఎమ్మెల్యేల అభ్యర్ధన మేరకు శుక్రవారానికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కార్యకర్తల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం, వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించడమే ఈ గ్రీవెన్స్ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం అని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి సంస్థాగత పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ సమావేశానికి తప్పనిసరిగా ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేశారు.
నియోజవర్గాల్లో స్వీకరించిన వినతులను.. అలాగే పరిష్కరించిన వినతుల సంఖ్య తదుపరి వారం నివేదికను టీడీపీ కేంద్ర కార్యాలయానికి తెలిజేయాలని సూచించారు. సమావేశానికి హాజరైన, హాజరు కాని వారి వివరాలను, అలాగే సమావేశం యొక్క ముఖ్యమైన మినిట్స్ను కూడా కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పల్లా స్పష్టం చేశారు.