Pahalgam Terrorist Attack: జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి

- కాల్పుల ఘటనలో ఒకరి మృతి, ఆరుగురు పర్యాటకులకు గాయాలు
- పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలో ఘటన
- ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు, వైద్య సిబ్బంది
జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. పర్యాటకులపై జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ సంఘటనతో పహల్గాంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే, పహల్గాంలోని బైసరన్ వ్యాలీ ఎగువ ప్రాంతంలోని ఒక పర్యాటక రిసార్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాల ద్వారా మాత్రమే చేరుకునే వీలుంటుంది. ఇలాంటి ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైనిక తరహా దుస్తుల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, వైద్య బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన పర్యాటకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.