Jaydeep Burhani: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు... ఆ జట్టు మేనేజ్ మెంట్ స్పందన!

- లక్నో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపై వివాదం
- ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హక్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ
- ఆరోపణలు నిరాధారమని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఖండన
ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోయింది. ఇక్కడే ఫిక్సింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్ఆర్ ఎలా ఓడిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్య వివాదం రాజుకుంది.
ఈ మ్యాచ్ ఫలితంపై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అడ్హక్ కమిటీ కన్వీనర్ జయదీప్ బిహానీ సంచలన ఆరోపణలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
జయదీప్ బిహానీ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, జట్టు ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం పేర్కొంది. బిహానీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రాజస్థాన్ రాయల్స్ సీనియర్ అధికారి దీప్ రాయ్ సైతం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. "బిహానీ చేసినవి కేవలం తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు మాత్రమే" అని ఆయన కొట్టిపారేశారు.
"బిహానీ చేసిన అన్ని ఆరోపణలను మేం పూర్తిగా ఖండిస్తున్నాం. ఇటువంటి బహిరంగ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా, రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐల కీర్తి ప్రతిష్ఠలకు, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇది క్రికెట్ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నమే" అని ఆర్ఆర్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.