Jagdeep Dhankhar: పార్లమెంటే సుప్రీం: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఉప రాష్ట్రపతి

Vice President Dhankhars Remarks on Supreme Court

  • బిల్లుల ఆమోద విషయంలో రాష్ట్రపతికి కూడా గడువు విధించాలన్న సుప్రీంకోర్టు
  • వక్ఫ్ బోర్డు బిల్లుపై కూడా కీలక వ్యాఖ్యలు
  • రాజ్యాంగపరమైన విషయాల్లో ప్రజాప్రతినిధులదే అంతిమ నిర్ణయమన్న ఉప రాష్ట్రపతి

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై పరోక్షంగా భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటే సర్వోన్నతమైనదని, సుప్రీంకోర్టు కన్నా ఉన్నతమైనదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజ్యాంగపరమైన విషయాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులదే అంతిమ నిర్ణయమని ధన్‌ఖర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలో పార్లమెంటును మించిన వ్యవస్థ మరొకటి ఉందని ఎక్కడా పేర్కొనలేదని ఆయన అన్నారు. అన్నింటికన్నా పార్లమెంటే సుప్రీం అని ఆయన తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా, ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆయన గుర్తు చేశారు.

ఇటీవల కాలంలో కొన్ని బిల్లుల విషయంలో రాష్ట్రపతి ఆమోదానికి నిర్దిష్ట గడువు విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వివాదానికి తెర తీసింది. అలాగే వక్ఫ్ చట్టానికి సంబంధించిన విచారణను తదుపరి ఆదేశాల వరకు వాయిదా వేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి తాజా వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

సుప్రీంకోర్టు తీర్పులపై ఇటీవల కొందరు బీజేపీ నేతలు కూడా విమర్శలు చేశారు. సర్వోన్నత న్యాయస్థానమే ఆదేశాలు ఇస్తే, ఇక పార్లమెంట్ మూసేసుకుంటామని కొందరు నేతలు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

అయితే, సుప్రీంకోర్టుపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ నేతలు న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  

Jagdeep Dhankhar
Vice President of India
Supreme Court of India
Parliament
Indian Politics
BJP
Congress
Constitutional Crisis
Emergency
Supreme Court Verdict
  • Loading...

More Telugu News