Pope Francis: కొత్త పోప్ ఎన్నికలో ఓటు వేయనున్న నలుగురు భారతీయ కార్డినల్స్ వీరే!

- పోప్ ఫ్రాన్సిస్ (88) వాటికన్లోని తన నివాసంలో కన్నుమూత
- వాటికన్లో 9 రోజుల పాటు 'నోవెండియేల్' సంతాప దినాలు
- కొత్త పోప్ను ఎన్నుకునేందుకు త్వరలో 'కాంక్లేవ్' సమావేశం.
- ఎన్నికలో ఓటు వేయనున్న 135 మంది కార్డినల్స్లో నలుగురు భారతీయులు.
- కార్డినల్స్ ఫెర్రావ్, క్లీమిస్, ఆంథోనీ పూల, కూవక్కాడ్ కు ఓటు హక్కు
క్యాథలిక్ క్రైస్తవుల అధినేత పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. వాటికన్లోని కాసా శాంటా మార్టాలోని తన నివాసంలో ఈస్టర్ సోమవారం నాడు ఆయన తుది శ్వాస విడిచినట్లు వాటికన్ వర్గాలు ధృవీకరించాయి. ఆయన మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.
పోప్ ఫ్రాన్సిస్ మృతి నేపథ్యంలో వాటికన్లో తొమ్మిది రోజుల పాటు అధికారికంగా సంతాప దినాలు పాటించనున్నారు. దీనిని 'నోవెండియేల్'గా పిలుస్తారు. ఈ పురాతన రోమన్ సంప్రదాయాన్ని వాటికన్ ఇప్పటికీ ఆచరిస్తోంది.
ఈ సంతాప దినాలు ముగిసిన వెంటనే, కొత్త పోప్ను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన కార్డినల్స్ 'కాంక్లేవ్'గా పిలిచే ప్రత్యేక సమావేశంలో పాల్గొని తదుపరి పోప్ను ఎన్నుకుంటారు. ఈ అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోప్ ఎన్నికలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన కార్డినల్స్ సంఖ్య 135గా ఉంది.
ఈ ఎన్నికలో నలుగురు భారతీయ కార్డినల్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటం విశేషం. గోవా, డామన్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రావ్ (72), హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ ఆంథోనీ పూల (63), తిరువనంతపురం మేజర్ ఆర్చ్ బిషప్ కార్డినల్ బసేలియోస్ క్లీమిస్ తొట్టుంకల్, వాటికన్లోని మతాంతర సంప్రదింపుల విభాగం ప్రిఫెక్ట్గా పనిచేస్తున్న కార్డినల్ జార్జ్ జాకబ్ కూవక్కాడ్ (51) ఈ నలుగురిలో ఉన్నారు. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా కార్డినల్ ఫెర్రావ్, సిరో-మలంకర చర్చి సైనాడ్ అధ్యక్షుడిగా కార్డినల్ క్లీమిస్ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
