Gold Price: రూ. 1,00,000 మార్కు చేరుకున్న బంగారం ధర.. కారణాలివే

- బలహీనపడుతున్న డాలర్, వాణిజ్య ఉద్రిక్తతలు పసిడి ధర పెరుగుదలకు కారణం
- సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్ల మొగ్గు
- ఈ ఏడాది సుమారు రూ.20,000 పెరిగిన బంగారం ధర
- అనిశ్చితి నేపథ్యంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు
బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
సోమవారం నాడు ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ. 1,650 పెరిగి రూ. 99,800 వద్ద ముగిసింది. దీంతో జీఎస్టీ కలుపుకుంటే తుది ధర లక్ష రూపాయల మార్కును చేరుకుంది. శుక్రవారం సెలవు అనంతరం సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే పసిడి పరుగులు పెట్టింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో కూడా జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టులు రూ. 96,875 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర సుమారు 26 శాతానికి పైగా అంటే సుమారు రూ. 20,000 పెరిగింది.
డాలర్ ఇండెక్స్ గత మూడు నెలల్లో 10 శాతానికి పైగా క్షీణించి 99 మార్కు దిగువకు చేరింది. దీనికి తోడు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై నెలకొన్న ఆందోళనలు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నాయి. ఈ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 3,400 డాలర్ల సమీపంలో ట్రేడ్ అవుతోంది.
వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పెట్టుబడులు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. రాబోయే పండుగల సీజన్లో దేశీయంగా డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, వెండి ధర కూడా సోమవారం కిలోకు రూ. 500 పెరిగి రూ. 98,500కి చేరుకుంది.