Maye Musk: ముంబై సిద్ధి వినాయక ఆలయంలో ఎలాన్ మస్క్ తల్లి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రత్యేక పూజలు

- ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ ముంబై పర్యటన
- మాయే మస్క్తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఫెర్నాండేజ్
- తాను రచించిన పుస్తకం హిందీ ఎడిషన్ ఆవిష్కరణకు వచ్చినట్లు సమాచారం
ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆమెతో ఉన్నారు.
ఇరువురూ కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాయే మస్క్తో కలిసి దిగిన ఛాయాచిత్రాన్ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. మాయేతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా, మాయే మస్క్ తాను రచించిన ‘ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్’ పుస్తకం హిందీ అనువాద ప్రతిని ఆవిష్కరించేందుకు ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇటీవల తన 77వ జన్మదిన వేడుకలను కూడా ఆమె ఇక్కడే జరుపుకున్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాయే మస్క్ తన పుస్తకంలో తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, సవాళ్ల గురించి ప్రస్తావించారు.