Home Ministry: నకిలీ 500 నోట్లు వస్తున్నాయ్ జాగ్రత్త.. ఎలా గుర్తించాలో చెప్పిన హోంశాఖ

- చలామణిలోకి రూ.500 నకిలీ నోట్లు
- అత్యాధునిక సాంకేతికతతో తయారీ
- రిజర్వ్ బ్యాంక్ స్పెల్లింగ్ లో ఒక్క అక్షరమే తేడా
దేశంలోకి నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లను పెద్ద సంఖ్యలో దుండగులు చలామణిలోకి తెచ్చారని తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేయడం వల్ల నకిలీ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంది. అయితే, నకిలీ నోట్లపై ఓ చిన్న తేడాను గుర్తించినట్లు వివరించింది.
ప్రతీ నోటుపై విధిగా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) అనే అక్షరాల్లో ‘‘RESERVE’’ పదంలో ‘E’ బదులు ‘A’ పడినట్లు వెల్లడించింది. ఈ తేడాతో నకిలీ నోట్లను గుర్తించవచ్చని సూచించింది. ఈ సమాచారాన్ని డీఆర్ఐ, ఎఫ్ఐయూ, సీబీఐ, ఎన్ఐఏ, సెబీలతో కూడా పంచుకొంది. మీ చేతుల్లోకి వచ్చిన రూ.500 నోటును జాగ్రత్తగా పరిశీలించి చూశాకే అంగీకరించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది. వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు.