Kheel Das Kohistani: పాకిస్థాన్లో హిందూ మంత్రిపై దాడి

- సింధ్ ప్రావిన్స్లో థట్టా జిల్లాలో ఘటన
- మంత్రి ఖేల్ దాస్ కొహిస్తానీ కాన్వాయ్పై టమాటలు, బంగాళదుంపలతో దాడి
- తీవ్రంగా పరిగణించిన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్
- నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక
సాగునీటి కాలువల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్ ప్రజలు హిందూ మంత్రిపై దాడికి పాల్పడ్డారు. మత వ్యవహారాల రాష్ట్ర మంత్రి ఖేల్ దాస్ కొహిస్తానీ కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఆందోళనకారులు బంగాళదుంపలు, టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కొహిస్తానీ మంత్రిగా ఉన్నారు. థట్టా జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సింధ్లో హిందువులు సహా అనేక మంది మైనారిటీలు నివసిస్తున్నారు. దాడి ఘటనపై ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
సింధ్ రాష్ట్రంలో సాగునీటి అవసరాల కోసం నదుల దిగువ ప్రవాహాన్ని తగ్గించేలా కేంద్రం చేపట్టిన కాలువల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొహిస్తానీపై దాడి జరిగింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
పంజాబ్ ప్రావిన్స్లో గ్రీన్ పాకిస్థాన్ ప్రాజెక్టు కింద 6 సాగునీటి కాలువలు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆర్మీతో పాటు పంజాబ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం కూడా మద్దతిస్తోంది. అయితే, సింధ్ ప్రాంతంలోని అనేక జాతీయవాద పార్టీలు, సంస్థలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. కాలువల నిర్మాణం వల్ల తమ ప్రాంతానికి నీటి కొరత ఏర్పడుతుందని ఆరోపిస్తున్నాయి. కాగా, జమ్షోరో జిల్లాకు చెందిన కొహిస్తానీ 2018లో పీఎంఎల్-ఎన్ టికెట్పై ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు. 2024లో మళ్లీ విజయం సాధించి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.