Visakha Sarada Peetham: తిరుమలలో విశాఖ శారదాపీఠం మఠానికి టీటీడీ నోటీసులు

- తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం చర్యలు
- గోగర్భం డ్యామ్ వద్ద శారదాపీఠం మఠం నిర్మాణంలో అవకతవకలు
- 15 రోజుల్లో మఠం ఖాళీ చేసి భవనం అప్పంగించాలంటూ టీటీడీ నోటీసులు
సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా, తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి టీటీడీ నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో మఠం ఖాళీ చేసి, భవనాన్ని టీటీడీకి అప్పగించాలని అధికారులు స్పష్టం చేశారు.
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించారు. గోగర్భం డ్యామ్ వద్ద శారదాపీఠం మఠం నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం మఠం నిర్మించినట్టు నివేదికలో పేర్కొన్నారు.
నివేదిక ఆధారంగా, భవనం లీజు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో టీటీడీ షోకాజ్ నోటీసులపై శారదాపీఠం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, కోర్టు టీటీడీ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.