Boris Johnson: బ్రిటన్ మాజీ ప్రధాని వాడిన బెడ్... వేలంలో మరీ ఇంత చీపా?

- బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వాడినట్లు చెబుతున్న మంచం వేలం.
- ఆన్లైన్ వేదిక ఈబేలో 1,000 పౌండ్ల లోపు ధరకు అమ్మకానికి!
- ఇది 'చారిత్రక వస్తువు' అంటున్న విక్రయదారుడు
- 'అపఖ్యాతి పాలైన మాజీ ప్రధానిలా విశ్రాంతి పొందొచ్చు' అని వ్యాఖ్య
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఒకప్పుడు ఉపయోగించారని చెబుతున్న ఓ పాత మంచం ఇప్పుడు ఆన్లైన్లో వేలానికి వచ్చింది. ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ప్లేస్ అయిన ఈబేలో ఒక విక్రయదారుడు ఈ మంచాన్ని అమ్మకానికి పెట్టారు. దీని ప్రారంభ ధరను 1000 పౌండ్ల కంటే తక్కువగా నిర్ణయించడం విశేషం.
ఈ మంచం 'చరిత్రలో నిజమైన భాగం' అని సదరు విక్రయదారుడు తన ప్రకటనలో పేర్కొన్నారు. వివాదాస్పద రీతిలో పదవి నుంచి వైదొలగిన బోరిస్ జాన్సన్ ఈ మంచాన్ని గతంలో వాడారని ఆయన తెలిపారు. అయితే, జాన్సన్ ఎంతకాలం క్రితం ఈ మంచానికి యజమానిగా ఉన్నారనే వివరాలను మాత్రం విక్రయదారుడు వెల్లడించలేదు.
ఈ ఆన్లైన్ వేలంలో గెలిచిన అదృష్టవంతులు "అపఖ్యాతి పాలైన మాజీ ప్రధానిలా విశ్రాంతి తీసుకోవచ్చు" అని విక్రయదారుడు తన ప్రకటనలో సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఈబేలో ఈ మంచం వేలం ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మాజీ ప్రధాని వాడారని చెబుతున్న వస్తువు, అందులోనూ తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో ఈ వేలం పట్ల కొంత ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, ఇది నిజంగా బోరిస్ జాన్సన్ ఉపయోగించిన మంచమేనా అనేదానికి మాత్రం విక్రయదారుడి మాట తప్ప స్పష్టమైన ఆధారాలు లేకపోవడం గమనార్హం.
బోరిస్ జాన్సన్ 2019 నుంచి 2022 వరకు బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించారు. ప్రధానిగా ఉన్న సమయంలో బోరిస్ జాన్సన్ తీసుకున్న పలు నిర్ణయాలు మంత్రవర్గంలో ముసలం పుట్టడానికి కారణమయ్యయి. అప్పట్లో రిషి సునాక్ కూడా బోరిస్ జాన్సన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. జాన్సన్ తీరు నచ్చక రాజీనామా చేసిన పలువురు మంత్రుల్లో రిషి సునాక్ కూడా ఒకరు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తుండడంతో ఒత్తిడి పెరిగిపోయి, చివరికి బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.