JD Vance: రేపు భారత పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

- భారత్ లో నాలుగు రోజుల పాటు పర్యటన
- కుటుంబ సమేతంగా భారత్ కు వస్తున్న జేడీ వాన్స్
- రేపు సాయంత్రం ప్రధాని మోదీతో చర్చలు
- చర్చల అనంతరం వాన్స్ దంపతులకు విందు ఇవ్వనున్న మోదీ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రేపు (ఏప్రిల్ 21) భారత పర్యటనకు వస్తున్నారు. జేడీ వాన్స్ ఈ పర్యటనకు కుటుంబ సమేతంగా వస్తుండడం విశేషం. జేడీ వాన్స్ అర్ధాంగి ఉష భారత సంతతి మహిళ అని తెలిసిందే.
జేడీ వాన్స్ సోమవారం నాడు ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం పలికేందుకు భారత వర్గాలు సిద్ధమవుతున్నాయి. జేడీ వాన్స్ కు కేంద్ర కేబినెట్ సీనియర్ మంత్రి స్వాగతం పలుకుతారని తెలుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన భారత్ లో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన భారత్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జేడీ వాన్స్ కుటుంబం భారత్ లో పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనుంది. రేపు జేడీ వాన్స్ ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. దేశ రాజధానిలోని పలు చేనేత ఉత్పత్తుల దుకాణాలను సందర్శించనున్నారు.
సోమవారం సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ ప్రధాని మోదీ నివాసానికి చేరుకోనున్నారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నారు. చర్చలు ముగిసిన అనంతరం జేడీ వాన్స్-ఉష దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు.
వాన్స్ దంపతులు ఎల్లుండి (ఏప్రిల్ 22) జైపూర్ లోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ నెల 23న ప్రఖ్యాత తాజ్ మహల్ ను సందర్శించనున్నారు.