Harish Rao: మే 20న కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు

- కార్మికుల పట్ల కేంద్రం వైఖరి దుర్మార్గంగా ఉందని వ్యాఖ్య
- బీజేపీ మొదటి నుంచి కార్మిక వ్యతిరేక పార్టీ అని ఆరోపణ
- రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్న హరీశ్ రావు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20వ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు.
నేడు సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కార్మికుల పట్ల కేంద్రం ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని విమర్శించారు. బీజేపీ మొదటి నుంచి కార్మిక వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కనీసం ఆసుపత్రుల్లో కూడా మందులు అందుబాటులో లేవని ఆయన ఆరోపించారు. ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు.