Smitha Sabarwal: పోలీసుల నోటీసులపై స్పందించిన స్మితా సబర్వాల్

Smitha Sabarwal Responds to Gachibowli Police Notice

  • ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అని ప్రశ్న
  • కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఏఐ చిత్రాన్ని రీట్వీట్ చేసిన ఐఏఎస్
  • హాయ్ హైదరాబాద్ పోస్టును 2 వేల మంది రీట్వీట్ చేశారని వెల్లడి

కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువులు ఉన్నాయంటూ ఇటీవల ఏఐ ఫొటోతో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ‘హాయ్ హైదారాబాద్’ అనే ట్విట్టర్ యూజర్ ఓ ఏఐ ఫొటోను ట్వీట్ చేయగా.. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించి విచారణకు పిలిచారు. తొలుత ఈ నోటీసులకు స్పందించని స్మితా సబర్వాల్.. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని ట్వీట్లు చేశారు. తాజాగా శనివారం ఈ వివాదంపై స్మితా సబర్వాల్ స్పందించారు. గచ్చిబౌలి పోలీసులు పంపిన నోటీసులకు తాను జవాబిచ్చినట్లు తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

‘హాయ్ హైదరాబాద్’ ట్వీట్ ను తాను రీట్వీట్ చేశానని, తనలాగే మరో 2 వేల మంది కూడా దానిని రీట్వీట్ చేశారని స్మితా సబర్వాల్ గుర్తుచేశారు. తనకు పంపినట్లే మిగతా 2 వేలమందికి కూడా నోటీసులు పంపించారా..? అని నిలదీశారు. వారందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకున్నారా అని అడిగారు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారినే టార్గెట్ చేస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ ప్రచారంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా చర్యలు చేపట్టింది. మార్ఫ్ డ్ ఫొటోలను పోస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తోంది.

దీంతో అప్రమత్తమైన సీనియర్ నాయకులు తాము చేసిన పోస్టులను తొలగించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. అయితే, స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కి తగ్గకపోగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరిన్ని పోస్టులు చేస్తున్నారు. పోలీసుల నోటీసులు అందుకున్నా ఆమె దూకుడు తగ్గించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తారా.. ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు.

Smitha Sabarwal
Gachibowli Police Notice
AI Photo Controversy
Telangana Politics
Revanth Reddy
Kishan Reddy
Fake News
Twitter Controversy
IAS Officer
Hyderabad
  • Loading...

More Telugu News