Urvashi Rautela: ఊర్వశీ రౌతేలాపై పూజారుల ఫైర్

- తనకు గుడి కట్టించారంటూ నటి ఊర్వశి రౌతేలా సంచలన వ్యాఖ్యలు
- నటి వ్యాఖ్యలపై మండిపడుతున్న పూజారులు, స్థానికులు
- మత విశ్వాసాలను అగౌరవపర్చడమేనన్న బ్రహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్
ఒకవైపు బాలీవుడ్తో పాటు మరోవైపు టాలీవుడ్లో కూడా ఫుల్ పాప్యులర్ అయిన నటి ఊర్వశి రౌతేలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె వ్యాఖ్యలు ఆలయ పూజారులకు ఆగ్రహం తెప్పించాయి. ఉత్తర భారతదేశంలో తన పేరు మీద గుడి ఉందని, అదే విధంగా దక్షిణాదిలో కూడా అభిమానులు తనకు గుడి కట్టాలని కోరుకుంది.
ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి ఈ వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పూజారులు స్పందిస్తూ మండిపడ్డారు. ఊర్వశి రౌతేలా వ్యాఖ్యలు అందరినీ తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పూజారి భువన్ చంద్ర ఉనియాల్ అన్నారు. బద్రీనాథ్ సమీపంలో బామ్నిలో ఊర్వశి పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆలయంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది మత విశ్వాసాలను అగౌరవపర్చడమేనని బ్రహ్మకపాల్ తీర్థ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ అన్నారు.
ఊర్వశి వ్యాఖ్యలపై బద్రీనాథ్ నివాసితులు, అక్కడి హిందూ మత పెద్దలు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆమె గుడి కాదని, ఇలాంటి ప్రకటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఊర్వశి వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు.
బ్రహ్మ కపాల్ తీర్థ పురోహిత్ సొసైటి అధ్యక్షుడు అమిత్ సతీ కూడా ఊర్వశి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బామ్నిలో ఉన్న ఊర్వశి ఆలయం ఎంతో పురాతనమైనదని, ఊర్వశి దేవితో ముడిపడి ఉందని, ఏ వ్యక్తితోనూ కాదని తెలిపారు. ఆమె వ్యాఖ్యలు ఇక్కడి ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు.