Vijay Sai Reddy: విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఆరుగురు సభ్యుల సిట్ బృందం

- లిక్కర్ స్కామ్ లో సాక్షిగా విజయసాయిని ప్రశ్నిస్తున్న సిట్ బృందం
- రాజ్ కసిరెడ్డే ఈ స్కామ్ లో కీలక సూత్రధారి అని చెప్పిన విజయసాయి
- ఈరోజు కూడా విచారణకు హాజరైన రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి
లిక్కర్ స్కామ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు విజయసాయికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం పంపిన ఆయన... కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.
మొత్తం ఆరుగురు అధికారులు ఉన్న సిట్ బృందం విజయసాయిరెడ్డిని విచారిస్తోంది. విచారణ సందర్భంగా విజయసాయి కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డే (రాజ్ కసిరెడ్డి) కీలక సూత్రధారి అని సిట్ బృందానికి విజయసాయి తెలిపారు.
మరోవైపు, రాజ్ కసిరెడ్డికి సిట్ పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ... ఆయన ఎక్కడున్నారనే ఆచూకీ మాత్రం లభించలేదు. ఆయన ఫోన్ స్విచాఫ్ లో ఉంది. రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి ఈరోజు కూడా మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. విజయసాయి, ఉపేందర్ రెడ్డిలను వేర్వేరుగా సిట్ బృందం విచారిస్తున్నట్టు సమాచారం. ఒకరు చెప్పిన సమాధానాలకు అనుగుణంగా మరొకరిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.