Baba Ramdev: 'షర్బత్ జిహాద్' వ్యాఖ్యను సమర్థించుకున్న బాబా రామ్దేవ్

- ఏ ప్రత్యేక బ్రాండ్ను, మతాన్ని తాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదన్న బాబా రామ్దేవ్
- రూహ్ అఫ్జా వారే ఆ వ్యాఖ్యలను తమపై వేసుకున్నారని వెల్లడి
- రామ్దేవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఫిర్యాదు
యోగా గురు బాబా రామ్దేవ్ ఇటీవల చేసిన 'షర్బత్ జిహాద్' వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామ్దేవ్ వ్యాఖ్యలు ప్రముఖ శీతల పానీయం 'రూహ్ అఫ్జా'ను లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, తాను ఏ ప్రత్యేక బ్రాండ్ను, మతాన్ని ఉద్దేశించలేదని రామ్దేవ్ నేడు సమర్థించుకున్నారు. 'షర్బత్ జిహాద్' వ్యాఖ్యను రూహ్ అఫ్జా వారే తమపై వేసుకున్నారని, అలా చేయడం ద్వారా వారు ఆ పని చేస్తున్నట్లు అంగీకరించినట్లయిందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఉండవచ్చని అన్నారు. వారు మదర్సాలు, మసీదులు కట్టుకుంటుంటే ఫర్వాలేదు...ఈ విషయాన్ని సనాతన వాదులు అర్థం చేసుకోవాలి అని వ్యాఖ్యానించారు.
మరోవైపు, రామ్దేవ్ వ్యాఖ్యలు సమాజంలో మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ మంగళవారం నాడు టీటీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పతంజలి సంస్థ 'గులాబ్ షర్బత్'ను ప్రమోట్ చేసేందుకే, రామ్దేవ్ పోటీదారు అయిన రూహ్ అఫ్జాను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రూహ్ అఫ్జా అమ్మకాల లాభాలను మతపరమైన పనులకు వాడుతున్నారని చెప్పడమే 'షర్బత్ జిహాద్' అని, ఇది విద్వేషపూరిత ప్రసంగమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామ్దేవ్పై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు ఆధారంగా రామ్దేవ్ 'X' ఖాతా నుంచి షేర్ అయినట్లుగా చెబుతున్న వీడియో క్లిప్ను కూడా జతచేశారు. రామ్దేవ్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, సమాజంలో శాంతికి విఘాతం కలిగించేలా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కేవలం యజమాని ముస్లిం అయినందుకే ఒక ఉత్పత్తిని వ్యతిరేకించడం సరికాదన్నారు.
వారం రోజుల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని దిగ్విజయ్ సింగ్ హెచ్చరించారు. ఫిర్యాదు అందినట్లు భోపాల్ అదనపు డీసీపీ రష్మీ అగర్వాల్ ధృవీకరించారు. విచారణ జరుపుతున్నామని, వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.