Anjan Kumar Yadav: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దిష్టి బొమ్మ దగ్ధం

- హైదరాబాద్ లో నిన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమం
- కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంజన్ కుమార్ యాదవ్
- అంజన్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దగ్ధం చేశాయి. హైదరాబాద్ అంబర్ పేటలోని తిలక్ నగర్ చౌరస్తాలో దిష్టిబొమ్మకు నిప్పంటించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అంజన్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. నిన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అంజన్ కుమార్ మాట్లాడుతూ... కిషన్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ... తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు అంజన్ కుమార్ యాదవ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కార్పొరేటర్ అమృతతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.