Anchor Shyamala: ఆ భగవంతుడు ఇవాళ అదే గోతిలో మిమ్మల్ని పడేశాడు: యాంకర్ శ్యామల

- టీటీడీ కేంద్ర బిందువుగా రాజకీయ దుమారం
- కూటమి నేతల రాజకీయాల పట్ల నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడంలేదన్న శ్యామల
- ఇప్పుడు మీరు చేస్తున్న పనులేంటి? అంటూ ఫైర్
టీటీడీ కేంద్ర బిందువుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. నాటి నుంచి నేటి దాకా కూటమి నాయకులు ఆ ఏడుకొండల వాడి చుట్టూ రాజకీయాలు చేయడం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అంటూ కల్తీ ఆరోపణలు చేసిన కల్తీ నాయకులూ... మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనులేంటి? అంటూ మండిపడ్డారు.
తిరుపతి వెంకన్న సన్నిధిపై డ్రోన్ తిరగడం మీ అసమర్ధతకు నిలువెత్తు నిదర్శనం కాదా? తిరుపతి టిక్కెట్ కౌంటర్ లో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోవడం మీ నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనం కాదా? నేడు తిరుపతి గోశాలలో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం మీ నీచపు రాజకీయాలకు నిదర్శనం కాదా? నిషేధం ఉన్నప్పటికీ వెంకన్న సన్నిధిపై విమానాలు ఎగరడం మీ చేతగానితనానికి నిదర్శనం కాదా...? కొందరు భక్తులు ఆలయం ప్రధాన ద్వారం వరకు చెప్పులు వేసుకొని వసున్నారు అంటే అది మీ సోయి లేని ఏలుబడికి సాక్ష్యం కాదా? అని శ్యామల ప్రశ్నాస్త్రాలు సంధించారు.
"అయ్యా బాబు గారూ... ఇది మీ సర్కార్ లో వెంకన్న సన్నిధిలో జరిగిన జరుగుతున్న అపరాధాల చిట్టా! 2024 ఏప్రిల్ నుంచి నేటి వరకు 191 గోవులు చనిపోతే, అబ్బే అదేం లేదు అని చెప్పిన మీ చైర్మన్ పై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పగలరా? నెయ్యి నెయ్యి అంటూ గోతులు తవ్వాలని చూసిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఇవాళ అదే గోతిలో మిమ్మల్ని పడేశాడు.... చెరపకురా చెడేవు అంటే బహుశా ఇదే కాబోలు బాబు గారూ" అంటూ శ్యామల ధ్వజమెత్తారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో తన పోస్టుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఐ-టీడీపీలను ట్యాగ్ చేశారు.