Cancer Treatment Costs: క్యాన్సర్ చికిత్సకు డబ్బు వృధా చేయడం ఇష్టంలేక భార్యను చంపి భర్త ఆత్మహత్య

- ఘజియాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణం
- తనకు క్యాన్సర్ అని సూసైడ్ లెటర్ లో వెల్లడి
- కలిసి జీవించాం, కలిసే చనిపోతున్నామని వివరణ
క్యాన్సర్ బారిన పడ్డ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. చికిత్సకు పెద్దమొత్తంలో ఖర్చు చేసినా కోలుకునే అవకాశం అంతంత మాత్రమే కావడంతో డబ్బు వృధా చేయవద్దని భావించాడు. ఆపై భార్యను చంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ లో బుధవారం చోటుచేసుకుంది.
సిటీకి చెందిన కుల్ దీప్ త్యాగి (46) ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. చికిత్స తీసుకున్నా పూర్తిగా నయమవుతుందనే గ్యారంటీ లేదని తెలుసుకున్నాడు. పైగా చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో తనువు చాలించాలని త్యాగి నిర్ణయించుకున్నాడు. ఎల్లప్పుడూ కలిసే ఉంటానని భార్య అన్షు త్యాగికి చేసిన ప్రామిస్ గుర్తుకువచ్చింది. దీంతో ఇంట్లోని లైసెన్స్డ్ రివాల్వర్ తో భార్యను కాల్చి చంపి, తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
సూసైడ్ లెటర్ లో వివరాలు వెల్లడిస్తూ.. క్యాన్సర్ నుంచి కోలుకోవడం అసాధ్యమనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుల్ దీప్ త్యాగి పేర్కొన్నాడు. తన ఇద్దరు కొడుకులను ఈ విషయంలో తప్పుపట్టవద్దని కోరాడు. కాగా, కాల్పుల శబ్దం విని తల్లిదండ్రుల గదిలోకి పరిగెత్తగా.. అప్పటికే వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారని త్యాగి కుమారులు చెప్పారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించారని తెలిపారన్నారు. త్యాగి కుమారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు.