Akhilesh Yadav: ఈడీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్, ఇప్పుడు అదే పార్టీ ఇబ్బందిపడుతోంది: అఖిలేష్ యాదవ్

- ఈడీని రద్దు చేయాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్
- ఆర్థిక సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఇతర ఏజెన్సీలు ఉన్నాయన్న అఖిలేష్
- ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ వంటివి ఉన్నాయని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏర్పాటైందని, ప్రస్తుతం అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఒడిశా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సంబంధిత నేరాలను దర్యాప్తు చేయడానికి ఇతర ఏజెన్సీలు ఉన్నందున ఈడీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ కంటే ఈడీ గురించి తాను ఎక్కువగా మాట్లాడుతానని అన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈడీని ఏర్పాటు చేసిందో, అదే పార్టీ ఇప్పుడు ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలు ఉన్నందున ఈడీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో రెండు ఇంజిన్లు వేర్వేరు లైన్లలో వెళుతున్నాయని విమర్శించారు. ఒడిశాలో ఏం జరుగుతుందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని ఆయన అన్నారు.