Katy Perry: అంతరిక్షంలోకి ఇలా వెళ్లి అలా రావడానికి అన్ని కోట్లా...!

- అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన పాప్ సింగర్ కేటీ పెర్రీ
- పెర్రీతో పాటు పలువురు మహిళా ప్రముఖులు కూడా స్పేస్ లోకి ఎంట్రీ
- సీటు రిజర్వేషన్ ఫీజే రూ.1.25 కోట్లు!
ప్రఖ్యాత అమెరికన్ పాప్ గాయని కేటీ పెర్రీ తన జీవితంలో ఒక అరుదైన ఘనతను సాధించారు. మరో ఐదుగురు మహిళలతో కలిసి ఆమె అంతరిక్షపు అంచు వరకు విజయవంతంగా ప్రయాణించి వచ్చారు. కేటీ పెర్రీతో పాటు ఈ సాహస యాత్రలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్, ప్రముఖ సీబీఎస్ వ్యాఖ్యాత గేల్ కింగ్, నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త ఐషా బోవీ, శాస్త్రవేత్త అమండా గుయెన్, సినీ నిర్మాత కెరియాన్నె ఫ్లిన్ పాల్గొన్నారు. ఇది కేవలం 11 నిమిషాల రోదసి యాత్ర.
కాగా, బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్ష యాత్ర చేయాలనుకునే వారు ఆ సంస్థ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే, ఈ యాత్రకు టికెట్ ధర ఎంత అనేది బ్లూ ఆరిజిన్ అధికారికంగా ప్రకటించలేదు. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి 150,000 డాలర్లు (సుమారు రూ. 1.25 కోట్లు) డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని మాత్రం సమాచారం. 2021లో జరిగిన తొలి యాత్రలో ఒక సీటును వేలం వేయగా, అది ఏకంగా రూ.240 కోట్లకు అమ్ముడైంది.
అయితే, ఈ యాత్రకు అందరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. గతంలో 'స్టార్ ట్రెక్' నటుడు విలియం షాట్నర్, అమెరికన్ టీవీ వ్యాఖ్యాత మైఖేల్ స్ట్రాహన్ వంటి ప్రముఖులు బ్లూ ఆరిజిన్ 'అతిథులు'గా ఉచితంగానే ప్రయాణించారు. "ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. మీరు ఎవరు, మీకున్న సామాజిక పలుకుబడి, సంస్థ లక్ష్యాలకు మీరు సరిపోతారా? అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది" అని స్పేస్విఐపి అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు రోమన్ చిపోరుఖా గతంలో పేర్కొన్నారు.
తాజా కేటీ పెర్రీ యాత్రలో కూడా కొంతమంది ఉచితంగా ప్రయాణించారని, మరికొందరు రుసుము చెల్లించారని తెలిసింది. అయితే ఎవరు చెల్లించారు, ఎవరు ఉచితంగా వెళ్లారనే వివరాలను మాత్రం బ్లూ ఆరిజిన్ గోప్యంగా ఉంచింది.