Golconda Blue Diamond: ఒకప్పుడు మహారాజుల వద్ద ఉన్న అరుదైన వజ్రం... ఇప్పుడు వేలానికి వచ్చింది!

- అరుదైన 'గోల్కొండ బ్లూ' వజ్రం జెనీవాలో మే 14న వేలం
- 23.24 క్యారెట్ల బరువు
- ధర రూ.300 - రూ.430 కోట్ల మధ్య పలకొచ్చని అంచనా
- గతంలో ఇండోర్, బరోడా మహారాజుల సొంతం
- ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి లభించిన అపురూప వజ్రం.
భారతదేశపు ఘనమైన రాజరిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన అత్యంత అరుదైన 'గోల్కొండ బ్లూ' నీలి వజ్రం మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల ఆధీనంలో ఉన్న ఈ అపురూప వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించే 'మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్' వేలంపాటలో విక్రయానికి ఉంచనున్నారు.
23.24 క్యారెట్ల బరువున్న ఈ అద్భుతమైన వజ్రాన్ని పారిస్కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల రూపకర్త జేఏఆర్ రూపొందించిన ఆధునిక ఉంగరంలో పొదిగారు. దీని విలువ 35 మిలియన్ల నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్య (సుమారు రూ. 300 కోట్ల నుంచి రూ. 430 కోట్లు) ఉండవచ్చని క్రిస్టీస్ అంచనా వేస్తోంది. క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జ్యువెలరీ, రాహుల్ కడాకియా మాట్లాడుతూ, "ఇంతటి గొప్ప రాజరిక వారసత్వం కలిగిన వజ్రాలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే మార్కెట్లోకి వస్తాయి. క్రిస్టీస్ తన 259 ఏళ్ల చరిత్రలో ఆర్చ్డ్యూక్ జోసెఫ్, ప్రిన్సీ, విట్టెల్స్బాచ్ వంటి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన కొన్ని వజ్రాలను వేలం వేసే గౌరవాన్ని పొందింది. రాజరిక నేపథ్యం, అసాధారణమైన రంగు, విశిష్టమైన పరిమాణంతో 'ది గోల్కొండ బ్లూ' ప్రపంచంలోని అత్యంత అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలుస్తుంది" అని తెలిపారు.
ఈ వజ్రం మూలాలు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలోని ప్రఖ్యాత గోల్కొండ గనులతో ముడిపడి ఉన్నాయి. కోహినూర్, హోప్ డైమండ్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక వజ్రాలు ఈ గనుల నుంచే లభించాయి. ఈ వజ్రం భారతీయ రాజవంశీకుల చేతులు మారడం దీని చారిత్రక ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. 20వ శతాబ్దపు ఆధునిక భారతీయ పాలకులలో ఒకరైన ఇండోర్ మహారాజా యశ్వంత రావు హోల్కర్-II అధీనంలో ఈ వజ్రం ఉండేది. 1923లో ఫ్రెంచ్ జ్యువెలర్ చౌమెట్ రూపొందించిన బ్రేస్లెట్లో దీనిని పొదిగారు.
1930ల నాటికి, మహారాజా అధికారిక ఆభరణాల తయారీదారు మౌబౌసిన్ దీనిని 'ఇండోర్ పియర్స్' అనే మరో రెండు ప్రఖ్యాత గోల్కొండ వజ్రాలతో కలిపి ఒక అద్భుతమైన నెక్లెస్లో భాగంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత 1947లో, ఈ వజ్రం అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ చేతికి చిక్కింది. ఆయన దీనిని అంతే పరిమాణంలో ఉన్న మరో తెల్ల వజ్రంతో కలిపి ఒక బ్రూచ్గా తయారు చేశారు. అనంతరం బరోడా రాజకుటుంబం వద్దకు చేరి, చివరికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది.
ప్రస్తుతం, జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గూస్లో జరిగే వేలం ద్వారా 'ది గోల్కొండ బ్లూ' తన తదుపరి యజమాని కోసం ఎదురుచూస్తోంది. వేలంలోకి వస్తున్న అతిపెద్ద నీలి వజ్రాలలో ఇది ఒకటి కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద నీలి వజ్రంగా 45.52 క్యారెట్ల హోప్ డైమండ్ గుర్తింపు పొందింది. ఇది వాషింగ్టన్ డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉంది. ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన నీలి వజ్రం 14.62 క్యారెట్ల 'ఒపెన్హైమర్ బ్లూ'. ఇది మే 2016లో క్రిస్టీస్ జెనీవా వేలంలో 57.5 మిలియన్ డాలర్లకు పైగా ధర పలికింది.
