KTR: ఒకసారి మోసపోతే మోసగాడి తప్పు... పదే పదే మోసపోతే... అది మన తప్పే: కేటీఆర్

KTR Slams Revanth Reddy Repeatedly Deceived People

  • మల్కాజిగిరిలో కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం
  • కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు
  • తప్పుడు హామీలతో ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టారని ఆగ్రహం

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి వంటి మోసపూరిత వ్యక్తిని నమ్మడం వల్ల ప్రజలు నిరాశకు గురయ్యారని, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. మల్కాజ్‌గిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అవాస్తవమని, దీని ఫలితంగా ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని విమర్శించారు.

ఒకసారి మోసపోతే మోసగాడి తప్పే అవుతుంది, కానీ పదే పదే మోసపోతే మనదే తప్పని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని, అలాగే అన్ని ఎన్నికల్లోనూ వారిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అధోగతి పాలవుతున్నా రేవంత్ రెడ్డి మాత్రం సంతోషంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి పాలనతో విసిగిపోయారని, ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. డంపింగ్ యార్డ్ వంటి సమస్యలపై ఆయన పోరాడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని తెలిపారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మార్పు సాధ్యమని రాజశేఖర్ రెడ్డి నిరూపించారని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ ఆత్మ, తెలంగాణ ఆత్మాభిమానం కాపాడాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న జరగబోయే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల పార్టీ ప్రయాణం ఒక మైలురాయి అని, తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి ఘనత సాధించిన రెండో పార్టీ మనదే అని అన్నారు. 

KTR
Revanth Reddy
BRS
Congress
Telangana Politics
GHMC Elections
Malkajgiri
Rajasekhar Reddy
Telangana
Political Criticism
  • Loading...

More Telugu News