KTR: కేటీఆర్ పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

- దమ్ము, ధైర్యం లేవా అంటూ ప్రశ్నించిన పొన్నం
- ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలని డిమాండ్
- కంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ ఆరోపణలు అర్థరహితమని వ్యాఖ్య
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ వెనకుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడన్న కేటీఆర్ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ నేతలు అవివేకంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తూ వారి అవివేకాన్ని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. ఒకవేళ సీఎంను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ప్రకటన చేసేవారని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.