Jitu Raghuvanshi: బలవంతంగా ఆలయంలోకి మూక.. గేట్లు తెరవలేదని పూజారిపై దాడి

- మధ్యప్రదేశ్లోని దేవాస్లో ఘటన
- అర్ధరాత్రి 10 కార్లతో కాన్వాయ్గా వచ్చిన జితు రఘువంశీ
- ఈ సమయంలో గేట్లు తెరవడం సాధ్యం కాదన్నందుకు పూజారిపై దాడి.. చంపేస్తామని బెదిరింపు
అర్ధరాత్రి వేళ ఆలయ గేట్లు తెరవడం వీలుకాదన్న పూజారిపై 30 మంది దాడిచేసి ఈడ్చిపడేశారు. చంపేస్తామని బెదిరించారు. మధ్యప్రదేశ్లో దేవాస్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రాత్రి పొద్దుపోయాక జితు రఘువంశీ 8 నుంచి 10 కార్లతో కాన్వాయ్గా మాతా టెక్రి ఆలయానికి వచ్చాడు. అతడిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాన్వాయ్లోని రెండు కార్లకు ఎర్రబుగ్గ కూడా ఉన్నట్టు చెప్పారు.
అర్ధరాత్రి కావడంతో ఆలయ తలుపులు మూసివేశామని, 30 మందితో కలిసి జితు రఘువంశీ అర్ధరాత్రి 12.40 గంటలకు ఆలయానికి వచ్చారని పూజారి తెలిపారు. ఆలయ తలుపులు మూసివేశామని, ఇప్పుడు తెరవడం కుదరదని చెప్పినా వినకుండా బలవంతంగా తనతో గేట్లు తెరిపించారని, ఆ తర్వాత తనను లాగిపడేసి కొట్టారని, చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత లోపల వారు పూజలు చేశారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు అయిందని, ఆలయ ఆవరణలో ఉన్న 50 సీసీటీవీలను పరిశీలిస్తున్నామని సిటీ ఎస్పీ దినేశ్ అగర్వాల్ తెలిపారు. జితు రఘువంశీ బీజేపీ నేత కుమారుడా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.