Subramanya Swami: టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయన్న విషయంపై సుబ్రహ్మణ్యస్వామి స్పందన

- తిరుమల గోశాలలో గోవులు పెద్ద ఎత్తున చనిపోయాయన్న మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
- పూర్తి వివరాలు సేకరించి పిల్ దాఖలు చేస్తానని ట్వీట్ చేసిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి
- భూమన ఆరోపణలను ఖండిస్తున్న ఏపీ మంత్రులు
టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందిన అంశంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ అంశంపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సైతం ఎక్స్ వేదికగా స్పందించారు.
గోవుల మృతి విషయం టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా తెలిసిందని, దీనిపై మరింత సమాచారం సేకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం గోసంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి సమాచారంతో త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేస్తానని తెలిపారు.
టీటీడీ గోశాలలో పెద్ద ఎత్తున గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ ఛైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆవులు ఎలా చనిపోయాయో తెలుసుకునేందుకు పోస్టుమార్టం కూడా నిర్వహించలేదని ఆయన అన్నారు.
గోశాలకు ఎటువంటి సంబంధం లేని డీఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ఛార్జ్గా నియమించారని, దీనిపై విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. భూమన ఆరోపణలను పలువురు మంత్రులు ఖండించడంతో పాటు ఆయనపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.