Punjab Kings: రఫ్ఫాడించిన పంజాబ్ కింగ్స్... సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

- ఉప్పల్ స్టేడియంలో ఊచకోత
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
- సిక్సర్ల మోత మోగించిన శ్రేయాస్ అయ్యర్
- తొలి పవర్ ప్లేలో ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ విధ్వంసం
- ఆఖరి ఓవర్లో వరుసగా 4 సిక్సులు కొట్టిన స్టొయినిస్
- 4 ఓవర్లలో 75 పరుగులిచ్చిన షమీ
ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ పరుగులు వెల్లువెత్తించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
విధ్వంసం అంటే పంజాబ్ ఓపెనింగ్ ద్వయం గురించే చెప్పుకోవాలి. యువ సంచలనం ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి పవర్ ప్లేలో సన్ రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు కేవలం 4 ఓవర్లలోనే 66 పరుగులు జోడించారంటే ఎలా చితకబాదారో అర్థమవుతుంది. ప్రియాన్ష్ ఆర్యా 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 38 పరుగులు చేయగా... ప్రభ్ సిమ్రన్ సింగ్ 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 42 పరుగులు చేశాడు. నేహాల్ వధేరా 27 పరుగులు చేశాడు.
ఇక, చివర్లో మార్కస్ స్టొయినిస్ మెరుపు ఇన్నింగ్స్ మరో హైలైట్ గా నిలిచింది. మహ్మద్ షమీ విసిరిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో స్టొయినిస్ వరుసగా 4 సిక్సులు కొట్టడం విశేషం. స్టొయినిస్ 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో 34 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో ప్రతి ఒక్కరూ ఓవర్ కు 10కి పైగా పరుగులిచ్చుకున్నారు. హర్షల్ పటేల్ కాస్తంత మెరుగ్గా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయగా, కొత్త బౌలర్ ఇషాన్ మలింగ 2 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.
మహ్మద్ షమీ ఒక్క వికెట్ కూడా తీయకపోగా... 4 ఓవర్లలో ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డును కొద్దిలో తప్పించుకున్నాడు. ఈ రికార్డు జోఫ్రా ఆర్చర్ పేరిట ఉంది. ఈ సీజన్ లోనే సన్ రైజర్స్ పై ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆర్చర్ తర్వాత షమీ రెండో స్థానంలో నిలిచాడు.