Rakesh Reddy: రాకేశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

- అన్యాయాన్ని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా అని ఆగ్రహం
- కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న హరీశ్ రావు
- నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపణ
తమ పార్టీ నేత రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
రాకేశ్ రెడ్డి గ్రూప్-1 అభ్యర్థుల తరఫున ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూనే నియంతృత్వ పాలన సాగించడమేమిటని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు అంటూ బెదిరించడమేమిటని అన్నారు. ఆరోపణలు వస్తే, వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేసులను తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు.