MS Dhoni: కెప్టెన్గా తన రికార్డును తానే బద్దలు కొట్టనున్న ధోనీ

- మోచేతికి గాయం కారణంగా టోర్నీకి దూరమైన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- అతడి స్థానంలో జట్టును నడిపించనున్న ధోనీ
- ఐపీఎల్లో అత్యధిక వయసు కలిగిన కెప్టెన్గా ఘనత
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ నేడు మరో రికార్డును తన పేరున రాసుకోనున్నాడు. మోచేయి గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్లకు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. దీంతో మిగిలిన మ్యాచ్లకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. నేడు కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్కు ధోనీ స్కిప్పర్గా వ్యవహరిస్తాడని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధ్రువీకరించాడు. రుతురాజ్ జట్టుకు దూరం కావడం చెన్నైకి పెద్ద ఎదురు దెబ్బే. ఇప్పటికే ఆ జట్టు 5 మ్యాచుల్లో నాలుగింటిలో ఓడింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 9వ స్థానంలో నిలిచింది.
గువాహటిలో గత నెల 30న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గైక్వాడ్ గాయపడ్డాడు. గైక్వాడ్ మోచేతిలో చిన్న ఫ్రాక్చర్ ఉన్నట్టు ఫ్లెమింగ్ తెలిపాడు. మిగతా మ్యాచుల్లో ఆడేందుకు గైక్వాడ్ ప్రయత్నించినా దురదృష్టవశాత్తు వీలు కాలేదన్నాడు. ఇప్పటి వరకైతే అతడు టోర్నీకి దూరమైనట్టేనని పేర్కొన్నాడు. కాబట్టి మిగతా మ్యాచ్లకు ధోనీ సారథ్యం వహిస్తాడని చెప్పాడు.
నేటి మ్యాచ్కు ధోనీ సారథ్యం వహిస్తే అతడి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరుతుంది. ఐపీఎల్లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్గా రికార్డులకెక్కుతాడు. ధోనీ వయసు నేటికి 43 సంవత్సరాల 278 రోజులు. 2023లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్కు ధోనీ 41 సంవత్సరాల 325 రోజుల వయసులో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా, ఇప్పుడు 43 ఏళ్ల వయసులో జట్టుకు సారథ్యం వహిస్తున్న తొలి కెప్టెన్గా రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు.