Keerthy Suresh: కీర్తి సురేశ్ కూడా అదే వరస .. ఎలా నెగ్గుకొస్తుందో ఏమో!

- కీర్తి సురేశ్ కి యూత్ లో మంచి క్రేజ్
- తెలుగులో 'దసరా' తరువాత దక్కని హిట్
- తమిళ సినిమాలపైనే దృష్టిపెడుతూ వచ్చిన కీర్తి
- తాజాగా బాలీవుడ్ పైనే పెట్టిన ఫోకస్
కీర్తి సురేశ్ .. ముద్దుగా .. ముద్దబంతిలా కనిపించే హీరోయిన్. తెరపైనే కావొచ్చుగానీ, అలిగితే అమ్మడి అందమే వేరు అనేది కుర్రాళ్ల మాట. అలాంటి కీర్తి సురేశ్ మొదటి నుంచి కూడా తమిళ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వచ్చింది. తెలుగులో అడపాదడపా మాత్రమే చేస్తూ వచ్చినప్పటికీ, ఇక్కడ టాప్ త్రీ ప్లేస్ లోనే ఆమె పేరు కనిపిస్తూ వచ్చింది.
అయితే ఇక్కడ కీర్తి సురేశ్ కి 'దసరా' సినిమా తరువాత హిట్ లేదు. ఈ సినిమా తరువాత కూడా ఆమె ఎక్కువగా తమిళ సినిమాలనే ఒప్పుకుంటూ వెళ్లింది. క్రితం ఏడాది ఆమె 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైంది. ఆ సినిమా అక్కడి థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయినా బాలీవుడ్ లో తానేమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కీర్తి సురేశ్ ఉందని అంటున్నారు. రాజ్ కుమార్ రావు జోడిగా ఆమె ఓ సినిమాకి సైన్ చేసిందని టాక్.
తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలలో రాణిస్తూ వస్తున్న హీరోయిన్స్ లో చాలామంది చూపు బాలీవుడ్ వైపే ఉంటుంది. బాలీవుడ్ లో జెండా ఎగరేయడమే తమ అంతిమ లక్ష్యం అన్నట్టుగా ఇవతల గట్టు పైనుంచే ప్రయత్నించేవాళ్లు కొంతమంది, అక్కడే మకాం పెట్టేసి అవకాశాలను వెతికి పట్టుకునేవాళ్లు మరికొంతమంది. ఇలియానా .. కాజల్ .. శృతిహాసన్ .. తమన్నా లాంటివారే అక్కడి స్టార్ వార్ లో కుదురుకోలేకపోయారు. అమాయకంగా కనిపించే కీర్తి ఎలా నెగ్గుకొస్తుందేమో ఏమోమరి.