Jagan Mohan Reddy: జిల్లా ఎస్పీ మహిళ అనే విచక్షణ కూడా లేకుండా జగన్ మాట్లాడారు: పురందేశ్వరి

- పోలీసుల బట్టలు ఊడదీస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పురందేశ్వరి
- పోలీసు వ్యవస్థలో 5 వేల మంది మహిళలు ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తించాలని వ్యాఖ్య
- జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి పర్యటనలో పోలీసులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులను గుడ్డలు ఊడదీయిస్తానని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలను ఏపీ పోలీసుల అధికారుల సంఘం కూడా తప్పుబట్టింది. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
మరోవైపు జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. నాలుగో సింహంగా పరిగణించే పోలీసులను బట్టలూడదీసి కొడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆమె అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మహిళ అనే విచక్షణ కూడా లేకుండా జగన్ మాట్లాడారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థలో దాదాపు 5 వేల మంది మహిళలు ఉన్నారనే విషయాన్ని జగన్ గుర్తించాలని చెప్పారు. పోలీసులందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పోలీసు వ్యవస్థకి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.