KTR: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నిర్ణయాల ప్రభావం తెలంగాణపై ఉంటుంది: కేటీఆర్

KTR on Trump Tariffs Impact on Telangana

  • ఇప్పటికే రేవంత్ రెడ్డి హయాంలో వృద్ధి రేటు పడిపోయిందని వ్యాఖ్య
  • మద్యంపై వచ్చే ఆదాయం తప్ప మిగతా ఆదాయం తగ్గిందన్న కేటీఆర్
  • హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణను స్వాగతించిన కేటీఆర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాల ప్రభావం తెలంగాణలోని ఫార్మా, ఐటీ రంగాల ఎగుమతులపై ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం మినహా మిగిలిన ఆదాయం అంతా తగ్గిపోయిందని పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుగా నియమించుకోవడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిత్యనాథ్‌దాస్ నియామకం ఏపీ ప్రయోజనాల కోసమా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతికూల విధానాలు, ప్రతికూల రాజకీయాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. మాజీ సర్పంచ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు అందరిపై కేసులు ఎలా పెట్టాలనే ఆలోచన తప్ప అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు.

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కేసుల ఉపసంహరణతో పాటు జంతువధకు కారకులన వారిపై కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 'ఏఐ' వీడియోలతో తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. 'ఏఐ' అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని, దీనిలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను రెండు మూడు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు.

రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చి చాలా కాలమైనా మంత్రివర్గాన్ని విస్తరించుకోలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. సచివాలయంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన విఫలమైనందువల్లే కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుంటోందని అన్నారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకుంటోందని కేటీఆర్ అన్నారు. హన్మకొండలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే, 3 వేల ఆర్టీసీ బస్సులను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ చరిత్రలో రజతోత్సవ సభ అతిపెద్దదిగా నిలుస్తుందని అన్నారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపడతామని కేటీఆర్ చెప్పారు. అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి నెల వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

KTR
Telangana Politics
Revanth Reddy
Donald Trump Tariffs
Pharma Exports
IT Exports
BRS Party
Congress Party
BJP
Telangana Elections
  • Loading...

More Telugu News