YS Jagan: పవన్ కుమారుడికి ప్రమాదం... వైఎస్ జగన్ ఏమన్నారంటే..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
"సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని జగన్ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
ఇక ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి తదితరులు స్పందించారు. పవన్ కుమారుడు గాయపడడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.