NTR Vaidya Seva Trust: నేటి నుంచి యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేవలు

- సీఎం చంద్రబాబుతో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యం సంఘం నేతల భేటీ
- తక్షణం రూ.500 కోట్ల బకాయిల విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశం
- ఇతర సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటునకు హామీ
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద వైద్య సేవలు నేటి నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో వైద్య సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆశా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (ఆశా)తో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తక్షణమే రూ.500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో తమకు రావాల్సిన రూ.3,500 కోట్ల బకాయిలు, తమ ఇబ్బందులను స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం నేతలు చంద్రబాబుకు వివరించారు. అయితే త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారం కనుగొందామని సీఎం వారికి సూచించారు. అనంతరం వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో ఆశా నేతలు చర్చలు జరిపారు. మంగళవారం నిధులు విడుదల చేస్తామని అధికారులు తెలియజేశారు.
అనంతరం వైద్యసేవలు పునరుద్ధరించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం విడుదలైన నిధులు మొత్తం బకాయిలకు సరిపడకపోయినప్పటికీ సీఎం హామీని గౌరవిస్తూ, రాష్ట్ర ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుని ఏఎస్హెచ్ఏ కార్యవర్గం మంగళవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ కింద నగదు రహిత (క్యాష్ లెస్) సేవలు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రులు ఈ సేవలను మళ్లీ ప్రారంభించి, ప్రజలకు వైద్య సేవలలో అంతరాయం కలగకుండా చూడాలని ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.