Vikram Pawah: భారత్ లో టెస్లా... బీఎండబ్ల్యూ స్పందన ఇదే!

- భారత మార్కెట్ లోకి అమెరికన్ బ్రాండ్ టెస్లా!
- దేశీయ మార్కెట్ వాహన తయారీదారుల్లో కొంత ఆందోళన
- తమకు ఏ మాత్రం ఆందోళన లేదన్న బీఎండబ్ల్యూ ఎండీ అండ్ సీఈవో విక్రమ్ పవాహ్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన అమెరికన్ బ్రాండ్ టెస్లా భారతదేశంలో ప్రవేశిస్తుందన్న వార్తలు దేశీయ మార్కెట్లో కొంతమంది వాహన తయారీదారులను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే బీఎండబ్ల్యూ ఇండియా మాత్రం తమకు ఏ మాత్రం భయం లేదని పేర్కొంది.
బీఎండబ్ల్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో విక్రమ్ పవాహ్ ఈ అంశంపై స్పందిస్తూ టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈవీ మార్కెట్ పెరగాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఎక్కువ పోటీ ఉన్నప్పుడే ఆ విభాగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
టెస్లా కంపెనీ పోటీపై ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో తమ ఉనికి ఉందని పవాహ్ చెప్పారు. ప్రతి సంవత్సరం బీఎండబ్ల్యూ కార్ల విక్రయం వృద్ధిలో ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహన విభాగం సైతం ఆశాజనకంగానే ఉందని పేర్కొన్నారు. గత ఏడాది బీఎండబ్ల్యూ గ్రూపు ఎలక్ట్రిక్ వాహనాలను నాలుగు లక్షల కంటే ఎక్కువ విక్రయించిందని, ఇది అంతకు ముందు అమ్మకాలతో పోలిస్తే 13.5 శాతం అధికమని తెలిపారు.