Chandrababu Naidu: తిరుమల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu Naidu Reviews Tirumala Development Plans

  


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలలో పూర్తిస్థాయిలో మార్పులు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీటీడీపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, భక్తుల మనోభావాలు, ఆలయ పవిత్రతకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు, నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు. గత తొమ్మిది నెలల్లో తీసుకున్న చర్యలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వగా, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతి, ఇతర సేవలపై భక్తుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాబోయే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా టీటీడీని తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. అభివృద్ధి పనుల పేరుతో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయకూడదని, టీటీడీకి మనం ధర్మకర్తలం మాత్రమేనని ఆయన అన్నారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల సొమ్మును దుర్వినియోగం చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.

టీటీడీలో సమూల ప్రక్షాళన జరగాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అనేక మార్పులు చేశామని సీఎం గుర్తు చేశారు. అయితే, ఇంకా పాత వాసనలు, వ్యక్తులు కొనసాగకూడదని, అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేని వారిని కొనసాగించవద్దని ఆయన అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే జేఈవో, సీవీఎస్వో, ఎస్వీబీసీ ఛైర్మన్, బర్డ్ డైరెక్టర్ల నియామకాలు చేపడతామని తెలిపారు.

అలిపిరిలో 25 వేల మంది భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని, అక్కడ రోజుకు 25 వేల మంది భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం ద్వారా అక్రమాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు.

రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో టీటీడీ అందించిన సేవలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. క్యూలైన్ నిర్వహణ, వసతి, లడ్డూ రుచి, అన్నదానం వంటి అంశాలపై సర్వే నిర్వహించగా, ఎక్కువ మంది భక్తులు సేవలు బాగున్నాయని చెప్పినట్లు వెల్లడించారు.

అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని కూడా విస్తరణ పనులతో సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. కరీంనగర్, కొడంగల్, నవీ ముంబై, బాంద్రా, ఉలుందుర్పేట, కోయంబత్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులను కూడా ఆయన సమీక్షించారు.

Chandrababu Naidu
Tirumala Tirupati Devasthanams
TTD
Tirumala Development
Temple Development
Pilgrim Amenities
Andhra Pradesh
Religious Tourism
Temple Infrastructure
Tirupati
  • Loading...

More Telugu News