Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

- హై బ్లడ్ షుగర్ తో బాధపడుతున్న లాలూ
- ఈ ఉదయం ఆరోగ్యం విషమించినట్టు వార్తలు
- పాట్నాలోనే ఓ ఆసుపత్రిలో చేరిన వైనం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి ఈ ఉదయం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం హుటాహుటిన ఢిల్లీకి తరలించాలని భావించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆయనను పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చేరారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా హై బ్లడ్ షుగర్ తో బాధపడుతున్నారు. పాట్నాలో సాధారణ వైద్య పరీక్షలు, చికిత్స చేయించారు. అయినప్పటికీ లాలూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఇవాళ ఆయన చేతికి బ్యాండేజీ ఉండటం కనిపించింది.
2022లో ఆయన సింగపూర్లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని దానం చేశారు. 2024 సెప్టెంబరులో ముంబైలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. 2014లో ముంబైలోని ఒక ఆసుపత్రిలో ఆయనకు ఓపెన్-హార్ట్ సర్జరీ జరిగింది.
గత నెలలో లాలూ ప్రసాద్ యాదవ్ వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. మార్చి 26న ఆయన గార్డెనిబాగ్ వద్ద బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన బహిరంగంగా కనిపించలేదు.
ఇదిలా ఉండగా, ఆర్జేడీ కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితులు ఆర్జేడీ ఎన్నికల వ్యూహాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మాజీ రైల్వే మంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో పలు కులాలు, వర్గాలపై మంచి పట్టు ఉన్న రాజకీయ నేతలలో ఒకరు. ఆయన పార్టీకి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. ఆయన అనుమతి లేకుండా పార్టీ నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకోరు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పేరును ఎన్నికల ముందు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.