ETV Win: ఈటీవీ విన్ తెరపైకి పసందైన కథలు!

- ఈటీవీ విన్ లో 'కథాసుధ'
- ప్రతి ఆదివారం చెప్పే కొత్తకథ
- ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత
- మరింత ఆదరణ పెరిగే అవకాశం
మొదటి నుంచి కూడా ఈటీవీ తన ప్రత్యేకతను చాటుతూ వస్తోంది. కథల ఎంపికలో ఈటీవీ ఎప్పుడూ గట్టి కసరత్తు చేస్తుంది. కుటుంబ నేపథ్యం .. బంధాలు .. అనుబంధాలు .. ఎమోషన్స్ ప్రధానమైన కథలను అందిస్తూ ఉంటుంది. ఈటీవీ ధారావాహికలన్నీ కూడా కుటుంబ సమేతంగా చూడదగినవిగా ఉంటాయి. రేటింగును బట్టి కథను తిప్పడం ఈటీవీలో దాదాపుగా చూడం. అలాంటి ఈటీవీవారు .. ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా మరో ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈటీవీ విన్ లో ఈ నెల 6వ తేదీ నుంచి 'కథాసుధ' ప్రసారం కానుంది. ఈ 'కథాసుధ'లో ప్రతి ఆదివారం ఒక కొత్త కథ వచ్చి చేరనుంది. ఏ కథకు ఆ కథగా ఇది ప్రేక్షకులను పలకరిస్తుంది. గతంలో 'బాలచందర్ బుల్లితెర కథలు' ఈ తరహాలోనే ప్రసారమైనట్టుగా గుర్తు. గతంలో ఏ కథకు ఆ కథగా 'కథా సంపుటి'గా బుక్స్ వస్తుండేవి. అలాగే ఇప్పుడు వివిధ రకాల కథలను 'కథాసుధ' ద్వారా అందించనున్నారు.
నిజానికి వారానికి ఒక కథను అందించడం వలన .. ఆ కథల్లో ఫీల్ ను వర్కౌట్ చేసే సమయం దర్శకులకు దొరుకుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మంచి కథల ఎంపిక జరుగుతుంది ... కథల్లో సాగతీతకు అవకాశం ఉండదు. కొత్త దర్శకులకు .. రచయితలకు .. నటీనటులకు అవకాశాలు పెరుగుతాయి. ఒక మంచి కంటెంట్ ను చూసిన ఫీల్ ఆడియన్స్ కి ఉంటుంది. ఈటీవీ విన్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమే.