Rishabh Pant: రిషభ్ పంత్కు పంజాబ్ కింగ్స్ కౌంటర్ అదుర్స్.. ఆ టెన్షన్ దానంతటదే ముగిసిందన్న ఫ్రాంచైజీ!

- లక్నో వేదికగా నిన్న ఎల్ఎస్జీ, పీబీకేఎస్ మ్యాచ్
- లక్నోను చిత్తుగా ఓడించిన పంజాబ్
- కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరివరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించిన వైనం
- అటు లక్నో సారథి ఘోరంగా విఫలం
- ఈ సందర్భంగా మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన పంత్కు పీబీకేఎస్ కౌంటర్
లక్నో వేదికగా నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. 172 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 3.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్సింగ్ రాణించడంతో పాటు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో పీబీకేఎస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో లక్నో సారథి రిషభ్ పంత్ను ఆ ఫ్రాంచైజీ టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర రూ. 27కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ, పంత్ అందుకు తగ్గట్టుగా రాణించడం లేదు. ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో బ్యాటింగ్కు దిగిన అతడు వరుసగా 0, 15, 2 స్కోర్లు మాత్రమే చేశాడు. దీంతో పంత్పై ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నెర్ర చేస్తున్నారు. ఇలాంటి కెప్టెన్ను నమ్ముకుని టోర్నీలో బరిలోకి దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్సీతో పాటు బ్యాటర్గా, కీపర్గా కూడా పూర్తిగా విఫలమవుతున్నాడని ఏకిపారేస్తున్నారు.
ఇదిలాఉంటే... మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్పై పీబీకేఎస్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చింది. నిన్న ఎల్ఎస్జీపై మ్యాచ్ గెలిచిన తర్వాత "మెగా వేలం టెన్షన్ దానంతటదే ముగిసింది" అంటూ ట్వీట్ చేసింది. కాగా, వేలం తర్వాత తనను సారథిగా నియమించిన తర్వాత పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "వేలంలో పంజాబ్ నన్ను ఎక్కడ కొనుగోలు చేస్తుందో అని టెన్షన్ పడ్డా. శ్రేయస్ అయ్యర్ను దక్కించుకోవడంతో లక్నో జట్టులో చేరగలనని భావించా" అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు పంత్ మాట్లాడిన మాటలపైనే ఇప్పుడు పంజాబ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిందన్న మాట.