Gold Price: పసిడి పరుగు.. రూ. 94,000 దాటిన బంగారం ధర

- రోజురోజుకూ పెరుగుతూ సరికొత్త రికార్డుకు బంగారం ధర
- ఢిల్లీలో రూ.94,150కి చేరుకున్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర
- ఈ ఏడాది ఇప్పటి వరకు 18 శాతం పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పసిడి ధర నిత్యం పెరుగుతూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.94 వేల మార్కును దాటింది. దేశీయంగా పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం రూ.92,150 ఉండగా, నేడు రూ. 2,000 పెరిగి రూ.94,150కి చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
2025 క్యాలెండర్ సంవత్సరంలో బంగారం ధర ఇప్పటివరకు 18 శాతం పెరిగింది. జనవరి 1న రూ.79,390గా ఉన్న బంగారం ధర ఈ నాలుగు నెలల కాలంలో రూ.15,000 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,149 డాలర్లకు చేరుకుంది. అయితే, వెండి ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం రూ.1,03,000గా ఉన్న వెండి ధర రూ.500 తగ్గింది.