Mohanlal: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘ఎల్2: ఎంపురాన్’.. చరిత్ర సృష్టిస్తోందంటూ మోహన్లాల్ ట్వీట్!

- మోహన్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో ‘ఎల్2: ఎంపురాన్’
- విడుదలైన 4 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు
- 4 రోజుల్లోనే రూ. 200 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా రికార్డ్
మోహన్లాల్ హీరోగా నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన తాజా మలయాళ చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళుతోంది. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటించారు.
అయితే, ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది. గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించిన విధంగా ఈ మూవీలో సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం ఈ చిత్రం తగ్గేదేలేదంటోంది.
తాజాగా ‘ఎల్2: ఎంపురాన్’ రూ.200 కోట్ల క్లబ్లోకి చేరింది. రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా ‘ఎల్2: ఎంపురాన్’ రికార్డుకెక్కింది.
ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మోహన్లాల్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ఓవర్లార్డ్ రూ. 200 కోట్ల మార్క్ను అద్భుతంగా దాటాడు. 'ఎంపురాన్' చరిత్ర సృష్టిస్తోంది" అంటూ మోహన్లాట్ ట్వీట్ చేశారు.