Mahesh Kumar Goud: బీజేపీ, బీఆర్ఎస్ స్నేహం అంబికా దర్బార్ ప్రకటనలా ఉంది: మహేశ్ కుమార్ గౌడ్

- హెచ్సీయూ భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ బయటపడిందన్న టీపీసీసీ చీఫ్
- హెచ్సీయూ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
- కోర్టు కేసు పూర్తయ్యాక భూములను స్వాధీనం చేసుకుంటామన్న మహేశ్ కుమార్ గౌడ్
గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్నేహం అంబికా దర్బార్ అగరుబత్తి ప్రకటనలా ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రి మరోసారి బహిర్గతమైందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం హెచ్సీయూ భూములను లాక్కోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. హెచ్సీయూ భూములకు ప్రతిగా ఇదివరకే ప్రభుత్వ భూములు కేటాయించారని ఆయన పేర్కొన్నారు.
అప్పటి నుంచి అవి ప్రభుత్వ భూములుగానే పరిగణించబడుతున్నాయని అన్నారు. న్యాయస్థానం స్టే విధించిన కారణంగానే ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. కోర్టు కేసు ముగిసిన అనంతరం భూములను స్వాధీనం చేసుకుంటామని ఆయన వెల్లడించారు.