BJP MPs: హెచ్సీయూ 400 ఎకరాల భూమి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన బీజేపీ ఎంపీలు

- కంచ గచ్చిబౌలి భూములను కాపాడాలని ఉభయ సభల్లో ఎంపీల డిమాండ్
- కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రదాన్ను కలిసిన బీజేపీ ఎంపీలు
- జీరో అవర్లో రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కలిశారు. ధర్మేంద్ర ప్రదాన్ను కలిసిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్ ఉన్నారు.
ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభ జీరో అవర్లో ఈ భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. 400 ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల విక్రయానికి సిద్ధమైందని ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను కాపాడాలని కోరారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు. ఈ భూముల వ్యవహారంపై లోక్సభ జీరో అవర్లో తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు.
హెచ్సీయూ విద్యార్థులకు చికోటి ప్రవీణ్ మద్దతు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసనకు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు. సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, కారులో పోలీస్ స్టేషన్కు తరలించారు. కారులో పోలీసులు తరలిస్తున్న సమయంలోనే చికోటి ప్రవీణ్ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు బాధపడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ దారుణాలు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, ప్రకృతి విధ్వంసం చేయాలని కూడా చూస్తున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిలో జింకలు, నెమళ్లు, కుందేళ్లు, ఉడతలు, పాములు వంటి ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయని తెలిపారు. ప్రకృతి విధ్వంసం చేయవద్దని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగర పరిసరాల్లో ఇప్పటికే 50 శాతానికి పైగా పచ్చదనం ధ్వంసమైందని, ఇప్పుడు కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను వేలం వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భూమి కేవలం మనుషులకు మాత్రమే కాదని, జంతువులు, పక్షులకు నిలయమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆ భూముల్లో నెమళ్ల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.